-

కత్తితో ఫోటో.. కేసు తప్పదా?

13 Mar, 2019 12:11 IST|Sakshi

చిక్కుల్లో ధార్వాడ యువమోర్చా నేత

బనశంకరి: బీజేపీ యువమోర్చా కార్యకర్త పెద్ద కత్తిని పట్టుకుని సోషల్‌ మీడియాలో ఫోటో పెట్టడం కేసుకు దారితీసింది. ధార్వాడ బీజేపీ యువ మోర్చా ప్రధానకార్యదర్శి శక్తి హిరేమఠ లోకసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాక ముందు అక్కడి ఒక హోటల్‌లో తల్వార్‌ పట్టుకుని ఫోటోలు తీసుకున్నాడు. వాటిని ఫేస్‌బుక్, వాట్సప్‌లో  పోస్ట్‌ చేశాడు. దార్వాడ ఎంపీ ప్రహ్లాద్‌జోషి, ధార్వాడ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్‌బెల్లద కూడా ఇలాగే కత్తులు పట్టుకుని ఫోటోలు తీసుకోవడం విశేషం.

హిరేమఠ ఈ ఫోటోకు.. మరోసారి గెలుపు నాడే అనే ట్యాగ్‌లైన్‌ పెట్టడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కు పాల్పడ్డారని దార్వాడ జిల్లా అదికారయంత్రాంగం తెలిపింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన అనంతరం సోషల్‌ మీడియాలో కత్తులు, తుపాకులు, పిస్తోల్‌ లాంటి ఎలాంటి మారణాయుధాలు పట్టుకుని ఫోటోలు పెట్టరాదని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో కోడ్‌ అతిక్రమణ కింద కేసు నమోదు చేయాలని సీనియర్‌ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఎంపీ ప్రహ్లాద్‌జోషి, ఎమ్మెల్యే అరవిందబెల్లదకు కూడా ఇతడే కరవాలాన్ని అందించి ఫోటోలు దిగాడని, రెండురోజుల కింద ఈ ఘటన జరిగిందని తెలిసింది. సోషల్‌ మీడియాలో రచ్చ కావడంతో శక్తి హిరేమఠ దానిని ఫేస్‌బుక్‌ నుంచి తొలగించాడు.

మరిన్ని వార్తలు