నిజాయతీపరులకు వేధింపులా..?

18 Jul, 2017 19:06 IST|Sakshi
 
విజయపుర (బెంగళూరు): కాంగ్రెస్‌ పరిపాలనలో రాష్ట్రంలో ధనవంతులకు స్వర్గం చూపిస్తు, నిజాయతీపరులకు నరకాన్ని చూపిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత ఆర్‌.అశోక్‌ మండిపడ్డారు. అంతేకాకుండా మోసగాళ్లను, లంచగొండ్లను అడ్డుకునే అధికారులను బదిలీలతో బలి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవనహళ్ళి తాలూకా విజయపుర సమీపంలో ఉన్న ఆవతి గ్రామంలో పార్టీ సమావేశంలో అశోక్‌ పాల్గొని మాట్లాడారు. జైళ్ళ శాఖ డి.రూపా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక నూటికి నూరుశాతం వాస్తవాలను తెలిపిందని చెప్పారు. ఆ విషయాలు మొత్తం మీడియాలో వచ్చాయి.

జైలు అధికారులకు లంచాలను ఇస్తు కావలసిన సకల సౌకర్యాలను ఖైదీలు పొందుతున్నారని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే నిజాయతీపరురాలైన రూపకు బదిలీనే దక్కిందని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం చేతగాని తనం వల్లనే జరిగిందని ఆరోపించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ, కరీం తెల్గీల నుంచి డబ్బులు తీసుకుని వారికి అన్ని సౌకర్యాలను అందజేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. డీఎస్పీ గణపతి, కలెక్టర్‌ శిఖా విషయంలో కూడా ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని అన్నారు. దేశంలోనే ఉత్తమ సేవలను అందిస్తున్న కర్ణాటక పోలీసులకు నల్లటి మచ్చ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందని అన్నారు.
మరిన్ని వార్తలు