బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!

20 Nov, 2014 02:52 IST|Sakshi
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!

సాక్షి, న్యూఢిల్లీ:  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి వరించనుంది. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రాంశంకర్ ఖతేరియాలతో పాటు ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
 
 వీరితో ఏర్పాటైన ఖాళీలతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. కాగా తెలంగాణ నుంచి పి.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్‌లు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.   
 

>
మరిన్ని వార్తలు