పెళ్లికొడుకుని చంపేశారు..

20 Oct, 2016 18:50 IST|Sakshi
పెళ్లికొడుకుని చంపేశారు..

కరీంనగర్: కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీకి చెందిన ప్రేమికులు మహాంకాళి అనిల్(21), అస్తపురం మౌనిక ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో.. అమ్మాయి బంధువులు యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

 
ఇటీవలే జైలు నుంచి విడుదలైన అనిల్..  మౌనిక మైనారిటి తీరడంతో తిరిగి ఆమెను పెళ్లి చేసుకోవడానికి గురువారం ఏర్పాట్లు చేసుకున్నాడు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమజంట బుధవారం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో స్థానిక ఎల్‌ఎండీ కాలనీలోని తపాల నర్సింహస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుండగా.. విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆలయానికి చేరుకొని అనిల్‌ను తీవ్రంగా కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేసి యువతిని లాక్కెళ్లారు. ఈ ఘటనలో అనిల్ తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. సీపీ కమలాసన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనిల్ దారుణ హత్యపై స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అతని కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు