వడ్డీ వ్యాపారి దారుణ హత్య

24 Aug, 2014 02:21 IST|Sakshi
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
  • బెంగళూరులో పట్టపగలు దారుణం
  •  ఆటోతో ఢీకొని...కారంపొడి చల్లి
  •  మారణాయుధాలతో నరికి చంపారు
  • బెంగళూరు : నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై వడ్డీ వ్యాపారిని అతి దారుణంగా మారణాయుధాలతో నరికి హత్య చేసిన సంఘటన ఇక్కడి కాటన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాటన్‌పేట ఓటీసీ రోడ్డు రెండోక్రాస్‌లో నివాసముంటున్న బాబుసింగ్ (42)ను శనివారం దారుణంగా నరికి హత్య చేసి పరారయ్యారు.

    వివరాలు... వడ్డీ వ్యాపారం చేసే బాబుసింగ్‌కు నగరంలో అనేక ఇళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి సమీపంలోని బెస్కాం కార్యాలయంలో కరెంటు బిల్లులు కట్టడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఓటీసీ రోడ్డులో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బాబుసింగ్‌ను వెంబడించారు.

    ఓటీసీ రోడ్డులో వెనుక నుంచి ఆటోతో నడిచి వెళ్తున్న బాబుసింగ్‌ను ఢీకొన్నారు. కిందపడిన బాబుపై కారంపొడి చల్లి మారణాయుధాలు తీసుకుని దారుణంగా నరికి క్షణాల్లో పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఓటీసీ రోడ్డులో హత్య జరగడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బాబు సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

    ఇదిలా ఉంటే హత్య జరిగిన ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హత్య సంఘటన రికార్డు కావడంతో వాటి ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్, డీసీసీ లాబురామ్ తదితరులు పరిశీలించారు. బాబు సింగ్ హత్య వార్త తెలుసుకున్న ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.  ఆర్థికలావాదేవీలు, పాతకక్షల కారణంగానే బాబుసింగ్‌ను హత్య చేసి ఉంటారని త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని కాటన్‌పేట పోలీసులు తెలిపారు.
     

మరిన్ని వార్తలు