నేటితో ప్రచారానికి తెర

5 Feb, 2015 02:02 IST|Sakshi

ఆప్‌కు అనుకూలంగా సర్వేలు
చెమటోడ్చుతున్న కమలనాథులు
కష్టపడుతున్న కాంగ్రెస్
 

న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీఎస్సీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. 673 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.  

 ఆప్‌కు ‘క్రేజీ’వాల్..

ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, న్యూఢిల్లీ సీఎం అభ్యర్ధి అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి స్టార్ ప్రచారకులుగా ఉన్నారు. నగరంలోని 70 నియోజకవర్గాల్లో కేజ్రీవాల్ క్షణం తీరిక లేకుండా సుడిగాలి ప్రచారం చేస్తూ, తన నియోజకవర్గమైన న్యూఢిల్లీలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 49 రోజుల పాలన నుంచి తప్పుకున్నందుకు క్షమించాలని కేజ్రీవాల్ ప్రజలను వేడుకోవడంతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బినామీ కంపెనీల నుంచి ఆప్‌కు అందిన రూ.2 కోట్ల చందా విషయంలో విచారణకు సిద్ధమని ప్రకటించడమే కాదు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయంగా విచారణ జరిపిస్తామని హామీలిస్తూ నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో ఆప్ 30 నుంచి 40 స్థానాల మధ్య సీట్లు వస్తాయని తేలడం, సర్వేలు ఆప్‌కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తోంది.

చెమటోడ్చుతున్న బీజేపీ...

విధానసభ ఎన్నికలు బీజేపీని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడం, ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీజేపీకి ఢిల్లీలో గెలుపు కత్తిమీద సాములా మారింది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రచార భారాన్ని ప్రధాని నరేంద్ర మోదీపై వేసింది. గత నెల 9న రాంలీలామైదాన్‌లో నిర్వహించిన మోదీ ర్యాలీ ఆశించిన మేరకు విజయం కాకపోవడంతో కేంద్ర మంత్రులు, రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను ప్రచారంలోకి దింపారు.  మరోవైపు ఆప్‌పై రోజూ ఐదు ప్రశ్నలను సంధిస్తూ ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రేకెత్తించడానికి ప్రయత్నాలు చేస్తోంది. 
 
కాంగ్రెస్ ప్రచారం తీరు ఇలా..


కాంగ్రెస్ ఉనికి కోసం అష్టకష్టాలు పడుతోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పరిస్థితి ఈ సారి అంతకు భిన్నంగా లేదని సర్వేలు కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్ రెండు దశల్లో మేనిఫెస్టోలు విడుదల చేయగా, మహిళ భద్రత, తాగునీరు, విద్యుత్ చార్జీల తగ్గింపు, అనధికార కాలనీల క్రమబద్ధీకరణ తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒక ర్యాలీ నిర్వహించగా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎం ఉమన్ చాందీ, హరీశ్ రావత్, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.   
 
 

మరిన్ని వార్తలు