‘జడ్జీలను జడ్జీలే నియమించడం’ వ్యాఖ్యపై సుప్రీం ఆగ్రహం

9 Jun, 2015 03:04 IST|Sakshi
‘జడ్జీలను జడ్జీలే నియమించడం’ వ్యాఖ్యపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం తీవ్ర వాద, ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ ‘జడ్జీలే జడ్జీలను నియమించడం’ అనే పదాన్ని ఉపయోగించిన అటార్నీ జనరల్‌పై కేసును విచారిస్తున్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాట్ ఈజ్ దిస్?. పదం క్యాచీగా ఉంది కదా అని వాడినట్లున్నారు.

ఇది కరెక్ట్ కాదు. జడ్జీలను నియమించేది జడ్జీలు కాదు. రాష్ట్రపతి’ అంటూ ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అసహనం వ్యక్తం చేశారు. జడ్జీలే జడ్జీలను నియమిస్తారని రాజ్యాంగ రూపకర్తలు అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చన్న రోహత్గీ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తీసుకుంది.

ఈ విషయంలో కార్యనిర్వాహక వర్గం నుంచి అధికారం లాగేసుకున్న తీరును చూసి స్వర్గంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాధ పడి ఉంటారన్న రోహత్గీ కామెంట్‌పై తీవ్రంగా స్పందించిన జస్టిస్ ఖేహర్.. ‘అవును..జరుగుతున్నదంతా చూసి అంబేద్కర్ చాలాసార్లు బాధ పడి ఉంటార’ని తిరిగి అన్నారు.  ‘నా వీపు నీవు గోకు.. నీ వీపు నేను గోకుతా’ అన్నట్లు కొలీజియం వ్యవస్థ ఉండేదని, జడ్జీల నియామకం పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్లనే ప్రభుత్వం ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చిందని రోహత్గీ వివరించారు.

మరిన్ని వార్తలు