టీడీపీలో కలకలం

30 Aug, 2016 13:17 IST|Sakshi
టీడీపీలో కలకలం

హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఏవిధంగా ముందు కెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 29లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న, నేడు సమావేశమయ్యారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చే విషయంపై కసరత్తు జరుపుతున్నారు. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసు టీడీపీలో మరోసారి కలకలం రేపింది. కేసులో నిందితులుగా ఉన్నవారిని శిబిరాలకు తరలిస్తున్నట్టు సమాచారం. పొరుగు రాష్ట్రాలకు వీరిని పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పేరును చార్జిషీట్‌లో దాదాపు 33 సార్లు ప్రస్తావించింది. అంతేకాదు ఈ కుట్రకు ఎలాంటి వ్యూహం రచించింది... ఎవరెవరు పాత్రధారులు, సూత్రధారులనే విషయాన్ని స్పష్టం చేసింది. రూ.150 కోట్ల కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి న్యాయస్థానానికి అందించిన నివేదికలో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. దాదాపు 25 పేజీలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి ఏసీబీ అందజేసింది.

మరిన్ని వార్తలు