యడ్డీకి క్లీన్ చిట్

27 Oct, 2016 02:08 IST|Sakshi
యడ్డీకి క్లీన్ చిట్

ముడుపుల కేసు కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
యడ్డీ ఇద్దరు కుమారులు, అల్లుడితో సహా 13 మందికి ఊరట
కేసుపై పోరాటం :హీరేమఠ్


బెంగళూరు:  రాజకీయభవిష్యత్తుపై ప్రభావం చూపే కేసులో భారతీయ జనతాపార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పకు ఊరట లభించింది.  ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడితో సహా మొత్తం 13 మంది నిందితులు ఈ కేసు నుంచి బయట పడ్డారు. ఈమేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్.బీ ధర్మేగౌడ బుధవారం తీర్పు ఇచ్చారు. వివరాలు.. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్‌హెగ్డే రాష్ర్టంలోని అక్రమ గనుల తవ్వకాలపై 2012లో  నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. అందులో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  జిందాల్ కంపెనీకు చెందిన సౌత్‌వెస్ట్ మైనింగ్ సంస్థకు వివిధ కాంట్రాక్టులు దక్కారుు. ఇందుకు ప్రతిఫలంగా యడ్యూరప్పకు చెందిన ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు దాదాపు రూ.20 కోట్లు విరాళాలుగా అందాయని ఆరోపణ. ఈ విషయమై అప్పటి లోకాయుక్త సంతోష్‌హెగ్డే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలు నిజమేనని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ముఖ్యంగా ఈ విషయంలో యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన వారికి లబ్ధి చేకూర్చడానికి వీలుగా ప్రభుత్వ  ఖజానాకు వందల కోట్ల నష్టం కలిగించారని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా కాలంగా నష్టాలతో ఉన్న సౌత్‌వెస్ట్ మైనింగ్ సంస్థ ప్రేరణ ట్రస్ట్‌కు రూ.20 కోట్లు ఎలా ఇచ్చారన్న విషయమై సరైన లెక్కలు లేవని నివేదికలో పొందుపరిచారు. ఈ మొత్తం వ్యవహారంలో యడ్యూరప్ప కుమారులైన విజయేంద్ర, రాఘవేంద్రతో పాటు అల్లుడు సోహన్‌కుమార్ పాత్ర కూడా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు రాచేనహళ్లి సమీపంలోని దాదాపు ఒక ఎకరా స్థలాన్ని డీ నోటిఫై చేయడం వల్ల యడ్యూరప్ప కుమారులు రూ.18.78 కోట్లు లాభ పడగా యడ్యూరప్ప సభ్యుడిగా ఉన్న వివేకానంద ట్రస్ట్‌కు రూ.6కోట్లు జిందాల్ కంపెనీ నుంచి నిధులు అందాయని మరో ఆరోపణ కూడా ఎదుర్కొన్నారు. మొత్తంగా యడ్యూరప్ప ముఖ్యమంత్రింగా ఉన్న మయంలో దాదాపు రూ.40 కోట్లకు పైగా ముడుపులు పొంది రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్ల నష్టం చేకూర్చారని తేలింది. ఈ విషయంపై కర్ణాటకకే చెందిన సామాజిక కార్యకర్త హీరేమఠ్ సుప్రీంలో కేసు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో  యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 

 
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు...
లోకాయుక్త నివేదికను ఆధారంగా చేసుకుని యడ్యూరప్ప అక్రమాల పై స్వతంత్ర తనిఖీ వ్యవస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని కార్ణటకకు చెందిన సమాజ పరివర్తన సంఘం వ్యవస్థాపకుడు హీరేమట సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు సీబీఐ.. యడ్యూరప్ప ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపి లభించిన ఆధారాలతో ఈ ఏడాది మే నెలలో న్యాయస్థానంలో ఐపీసీ సెక్షన్ 120, 178తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 7,11,13/1, 2 కింద మొత్తం 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతం యడ్యూరప్ప తప్పు చేశారనేందుకు   సరైన ఆధారాలు చూపించలేదని పేర్కొంటూ న్యాయస్థానం కేసును కొట్టి వేసింది. ఈ విషయమై యడ్యూరప్ప తరఫున వాదనలు వినిపించిన సీ.వీ నగేష్ కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.’ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవడానికి ముందు మంచేనహళ్లిలో సదరు 1 ఎకరాకు నాలుగు వైపులా ఉన్న భూమి మొత్తం డీ నోటిఫికేషన్ జరింగింది.

యడ్యూరప్ప హయాంలో జరిగిన డీ నోటిఫికేషన్ జరిగిన ప్రాంతంలో (కేవలం ఒక ఎకరా)  అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రైవేటు సంస్థలు కాని ఎటువంటి ఇళ్ల సముదాయాలను నిర్మించలేదు. అందువల్ల ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇక స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం వల్లే నిధులు వచ్చాయన్న విషయం అన్న విషయమే ఉద్భవించదు. ఇక సీబీఐ కూడా ఈ విషయంలో సరైన ఆధారాలు చూపించలేకపోరుుంది.’ అని వివరించారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే అనధికారికంగా పేరొందిన యడ్యూరప్పకు తాజా తీర్పు గొప్ప ఊరటనిచ్చిందని తెలుస్తోంది. ఇక తీర్పు పై ఎవరేమన్నారంటే...

 
పోరాటం ఆపబోం    

యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రుపాయలు నష్టం వాటిల్లింది. సరైన దర్యాప్తు జరగకపోవడంతో పాటు అవసరమైన సాక్షాధారాలను కోర్టుకు అందజేయలేదు. తాత్కాలికంగా తమకు అపజయం కలిగినా అంతిమంగా న్యాయానిదే పై గెలుపు. అందువల్ల తమ పోరాటాన్ని కొనసాగిస్తాం. -హీరేమఠ్

 

శిక్షపడలేదన్నంత మాత్రాన... హత్య జరగనట్లు చెప్పలేం కదా ..
ఒక హత్య జరిగింది. ఇందుకు సంబంధించిన కేసు విచారణ కోర్టులో పూర్తరుు్యంది. అరుుతే ఎవరికీ శిక్ష పడలేదు. అంతమాత్రానా హత్యే జరగలేదని చెప్పలేం కదా? ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. రానున్న ఎన్నికల్లో సీఎం ఎవరన్న విషయం ప్రజలే నిర్ణరుుస్తారు. -సీఎం సిద్ధు

 

ఆయన చాలా గౌరవప్రదమైన నాయకుడు

సీఎం సిద్ధరామయ్య చాలా గౌరవ ప్రదమైన నాయకుడు అనుకుంటా. కోర్టు తీర్పులపై ఎలా ప్రతిస్పందించాలో ఆయనకు చెప్పనవసరం లేదు. ఇంతకంటే నేను సీఎం సిద్ధరామయ్య వాఖ్యలపై మాట్లాడదలుచుకోలేదు. -యడ్యూరప్ప 

 

 

 

>
మరిన్ని వార్తలు