సిమెంట్ రేట్లు పెరుగుతాయ్!

28 Aug, 2016 20:04 IST|Sakshi

రైల్వేలు బొగ్గు రవాణా చార్జీలను పెంచడంతో సిమెంటు రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీల పెంపు కారణంగా సిమెంటు పరిశ్రమపై రూ.2,000 కోట్లకు పైగానే ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ భారాన్ని వినియోగదారులపైనే వేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. బొగ్గు రవాణా టారిఫ్‌లలో రైల్వే శాఖ గత వారం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ దూరం రవాణా టారిఫ్‌లను కొంత తగ్గించి.. తక్కువ దూరానికి సంబంధించిన టారిఫ్‌లను పెంచింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు మించిన బొగ్గు రవాణాపై లోడింగ్, అన్‌లోడింగ్‌కు టన్నుకు రూ.110 చొప్పున కోల్ టెర్మినల్ సర్‌చార్జీని కూడా విధించింది. రైల్వేల తాజా టారిఫ్ పెంపు వల్ల సిమెంటు పరిశ్రమ ఉత్పాదక వ్యయం పెరిగేందుకు దారితీస్తుంది. మరోపక్క, విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఈ రెంటింటి కారణంగా పరిశ్రమపై రూ.2,000 కోట్ల భారం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కంపెనీలు భరించడం కష్టమే. ఫలితంగా సిమెంటు ధరలు పెరిగే అవకాశం ఉంది’ అని సిమెంటు తయారీదార్ల అసోసియేషన్(సీఎంఏ) ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు