మారుతున్న వ్యూహాలు

8 Oct, 2013 00:10 IST|Sakshi

సాక్షి, ముంబై: శివసేన నాయకులు సంజయ్ ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే మహారాష్ట్ర నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో సోమవారం భేటీ అయ్యారు. దీంతో వారిద్దరు ఎమ్మెన్నెస్‌లో మళ్లీ చేరనున్నారన్న వార్తలకు బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా సంజయ్ ఘాడి, రాజా చౌగులే శివసేనను వీడి ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఠాక్రే నివాస స్థానమైన కృష్ణకుంజ్‌కు ఇద్దరూ వెళ్లి భేటీ అయ్యారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన వీరిద్దరు గతంలో ఈ పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపిస్తూ శివసేనలో చేరారు.
 
 2007లో చౌగులే, 2009లో అసెంబ్లీ ఎన్నికల్ల సీటు ఇవ్వలేదన్న కోపంతో ఘాడీ శివసేన తీర్థం పుచుకున్నారు. ఇప్పుడు శివసేనలో ప్రాధాన్యం లేదంటూ వీరిద్దరు దసరాను పురస్కరించుకుని అధికారికంగా ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు సమాచారం. శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి సైతం పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. ఎంపీ టికెట్‌పై హామీ ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. అసంతృప్తి కారణంగా గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది వరకే ఒకరిద్దరు సొంతగూటికి వచ్చారు.

మరిన్ని వార్తలు