ఇది మనువాదుల కుట్ర: చెన్నయ్య

10 Aug, 2016 20:19 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలను వర్గీకరించేందుకు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, మనువాదులు కుట్ర పన్నారని మాల మహానాడు-టీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. దళితులపై బీజేపీ హయాంలోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడి జంతర్‌మంతర్‌లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద కుట్రలతో, విభజించు-పాలించు అన్న సూత్రంతో లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు.

 

వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆ దిశగా కేంద్ర మంత్రులు ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆధిపత్య కులాల ఆధీనంలో రాజకీయ అధికారం ఉన్నంత కాలం పీడిత వర్గాలకు న్యాయం జరగదని చరిత్ర నిరూపించిందని ఆందోళన వ్యక్తంచేశారు. గోసంరక్షణ పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దేశంలో దళితులపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది.

 

>
మరిన్ని వార్తలు