వాగ్యుద్ధం

28 Dec, 2013 03:31 IST|Sakshi
 చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాసమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించిన చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధంతో రసాభాసగా ముగిసింది. డీఎంకే సభ్యులు రెండుసార్లు వాకౌట్ చేసి అధికార పార్టీ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. మేయర్ సైదై దురైస్వామి అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముందుగా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. అన్నాడీఎంకే సభ్యురాలు శాంతి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్యాక్రాంత భూములను ఏ మేరకు స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై మేయ ర్ సమాధానమిస్తూ 2006 నుంచి 2011 వరకు 57 స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 
 
 అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు ఆర్ముగం లేచి డీఎంకే కేంద్ర కార్యాలయం నిర్మాణం అనంతరం స్థలాన్ని ఇంతవరకు కార్పొరేషన్‌కు అప్పగించలేదని పేర్కొన్నారు. 10 వేల చదరపు అడుగులకు మించి చేపట్టిన నిర్మాణం నుంచి కార్పొరేషన్‌కు కేటాయింపు జరగాల్సి ఉందని మేయర్ పేర్కొన్నారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలం అప్పగింతకు నిరాకరించారని పేర్కొన్నారు. ఇందుకు డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశంలో గందరగోళం సృష్టించారు. అధికార పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మరికొద్ది సేపటి తర్వాత మళ్లీ సమావేశం హాలులోకి వెళ్లారు.
 
 ఈ నేపథ్యంలో ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించడంపై అమ్మను అభినందిస్తూ తీర్మానం చేశారు. దీంతో మళ్లీ డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. చర్చలు, వాకౌట్‌లు, వాగ్యుద్ధాల నడుమ మొత్తం 75 తీర్మానాలు చేశారు. నగరంలోని మురికివాడలు, రోడ్లలో నివసించే ప్రజలకు 5 లక్షల దోమతెరలను ఉచితంగా పంచిపెట్టాలని తీర్మానించారు. మలేరియా, డెంగీ, చికున్‌గునియా, బోదకాలు వంటి వ్యాధులకు ప్రజలు గురికాకుండా ఇప్పటికే ఐదు లక్షల దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. తాజాగా మరో ఐదు లక్షలను పంపిణీ చేయాలని నిర్ణయించామని తీర్మానంలో పేర్కొన్నారు. దోమతెరలతోపాటు 20 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నటు చెప్పారు. 
 
 ఇందుకుగాను కార్పొరేషన్‌కు రూ.8.45 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. సమావేశం నుంచి వాకౌట్ చేసిన డీఎంకే సభ్యుడు సుభాష్ చంద్రబోస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము వాకౌట్ చేసినట్లు తెలిపారు. ప్రజా వినియోగానికి కేటాయించాల్సిన అన్నాఅరివాలయం స్థలంలో పార్కు, లైబ్రరీ నిర్మించామన్నారు. 
 
>
మరిన్ని వార్తలు