మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు

7 Aug, 2014 09:07 IST|Sakshi
మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు

చెన్నై: ఎయిర్‌సెల్ - మాక్సిస్ వ్యవహారంలో మారన్ సోదరులపై వచ్చేవారంలో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీబీఐ డెరైక్టర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. అందులో 2004 - 2007 మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా దయానిధిమారన్ పని చేశారు. ఆ సమయంలో ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త శివశంకరన్ చెన్నైలో నడుపుతున్న ఎయిర్‌సెల్ సమాచార సంస్థకు బ్రాడ్‌బ్యాండ్ కేటాయింపు కోరుతూ 2006లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి ఒప్పందం కుదరలేదు. ఇలా ఉండగా ఎయిర్‌సెల్ సంస్థ షేర్లు హఠాత్తుగా మలేషియా మాక్సిస్ సంస్థకు చేతులు మారాయి.  
 
 ఆ తరువాత అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సెల్ సర్వీసును ప్రారంభించేందుకు 14 లెసైన్స్‌లు ఇచ్చారు. దీనికి ప్రతి ఫలంగా మాక్సిస్ సంస్థ తమ అనుబంధ సంస్థల ద్వారా దయానిధిమారన్ సోదరుడు కళానిధిమారన్ నిర్వహించే సన్ డెరైక్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
 
 ఆ తరువాత శివశంకరన్ విదేశాల్లో  స్థిరపడ్డారు. 2008లో కరుణానిధి, మారన్ సోదరుల మధ్య అభిప్రాయాల భేదాలు ఏర్పడగా శివశంకరన్ ఢిల్లీ చేరుకున్నారు. సీబీఐతో మారన్ సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  మారన్ సోదరులపై చార్జ్‌షీటు రూపొందించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు