ఆ భూముల్లోకి బాంబులు ఎలా వచ్చాయి?

28 Aug, 2014 09:52 IST|Sakshi
ఆ భూముల్లోకి బాంబులు ఎలా వచ్చాయి?

చెన్నై : ఒక వైపు అటవీ భూమి, మరోవైపు స్పెషల్ టాస్క్‌ఫోర్సు అధికారుల పర్యవేక్షణ ఇవేమీ నిందితుల ఆగడాలను అడ్డుకోలేకపోయాయి. అయినా గుట్టుచప్పుడు కాకుండా భయంకరమైన పేలుడు పదార్థాలను భూమిలో పాతిపెట్టేసి, చల్లగా జారుకున్నారు. సేలం జిల్లా మేట్లూరు సమీపంలోని కొలత్తూరు అటవీ భూముల్లో మంగళ, బుధవారాల్లో బయటపడిన పేలుడు పదార్థాల డంప్ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ సంచరించిన ప్రాంతం, 20 ఏళ్ల క్రితం విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు రహస్యంగా శిక్షణ పొందిన ప్రదేశం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతంగా పరిగణిస్తోంది. అందుకే ఈ అటవీ ప్రాంతంలో అన్యుల ప్రవే శాన్ని అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్సు పర్యవేక్షణ ఏర్పాటు చేసింది.
 
 పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖవారు 50 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యూరు. మొక్కల కోసం మంగళవారంనాడు అటవీ సిబ్బంది గుంతలు తవ్వుతుండగా లోహపు శబ్దాలు వినపడ్డాయి. మరింత లోతుకు తవ్విచూడగా భూమి లోతుల్లో దాచివుంచిన పాత ఇనుప బేరల్ దొరికింది. ఆ బేరల్‌ను పగులగొట్టి చూరగా, అందులో అనేక చేతి బాంబులు, డిటోనేటర్లు, తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించింది. అంతేగాక మూడు పాలిథిన్ కవర్లలో తుపాకీ విడిభాగాలు లభ్యమయ్యూయి.
 
 వాటిని చూసి హడలిపోయిన అటవీ సిబ్బంది సేలం ఎస్పీ శక్తివేల్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్పీతోపాటూ క్యూబ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే పరిసరాల్లో తవ్విచూడగా మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఆయా పేలుడు పదార్థాల్లో కొన్నింటిపై ఎల్‌టీటీఈ అని రాసి ఉండటాన్ని కనుగొన్నారు. డంప్ దొరికిన స్థలానికి సమీపంలోని గోడమీద బుల్లెట్ తగిలిన గుర్తులను కనుగొన్నారు.

1980లో విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు పేలుడు పదార్థాల వినియోగం, తుపాకీ కాల్పులపై శిక్షణ పొందిన ప్రాంతంలో ఈ డంప్ దొరకడం అధికారులను ఆలోచింపజేసింది. డంప్‌లో దొరికిన పేలుడు సామగ్రి ఎక్కడా తప్పుపట్టినట్లుగా లేదు. రెండు దశాబ్దాలకు పైగా మట్టిలో పూడ్చిపెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా తుప్పుపట్టి ఉండేవి. పోనీ విద్రోహశక్తులు ఇటీవలే దాచిపెట్టారా అందామంటే ఈ భూములు 20 ఏళ్లుగా స్పెషల్ టాస్క్‌ఫోర్సు ఆధీనంలో ఉన్నారుు. ఈ భూముల్లో డంప్‌ను పాతిపెట్టడం ఎలా సాధ్యమని తలలు పట్టుకుంటున్నారు. మందు గుండు సామగ్రి దొరికిన  చోట బందోబస్తును ఏర్పాటు చేసి క్యూ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు