మంటగలిసిన మానవత్వం

15 Jun, 2017 19:06 IST|Sakshi
మంటగలిసిన మానవత్వం

చెన్నై :
చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కూడా లేని ఓ నిర్భాగ్యుడిపై నలుగురు యువకులు మద్యం మత్తులో తమ ప్రతాపం చూపించారు. ఇష్టానుసారంగా దాడి చేసి, అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలు.. చెన్నైలోని రంగరాజపురంలో ఇండియన్ బ్యాంక్ ఎదుట జూన్ 4న అర్థరాత్రి జాఫర్(50) అనే నిరాశ్రయుడు పడుకున్నాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు అటుగా వచ్చారు. వాళ్లు మద్యం మత్తులో సోయిమరిచి ఇష్టానుసారంగా జాఫర్పై దాడికి దిగారు.  అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో యువకుడు పైపుతో కూడా దాడి చేసి పైశాచికానందాన్ని పొందారు.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటనలో జాఫర్పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. వీరిలో శ్యామ్, పుగాజెందీ, రాజేశ్లతో పాటూ మరో మైనర్ బాలుడు ఉన్నారు. జాఫర్పై దాడి చేసినట్టు ఈ నలుగురు యువకులు ఒప్పుకున్నట్టు సమాచారం. మద్యం మత్తులో ఉండటంతో ఏం చేస్తున్నామో తమకు తెలియలేదని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంఘటన అనంతరం బాధితుడు జాఫర్ కనిపించకుండా పోయాడు. అత్యంత క్రూరంగా వ్యవహించిన నలుగురిపై కేసు నమోదు చేయడానికి బాధితుడు జాఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.