మున్సిపల్ సంస్థలకు నిధులపై సర్కారుకు హైకోర్టు నోటీసు

8 Apr, 2015 23:12 IST|Sakshi

మే 13లోగా జవాబివ్వాలని ఆదేశం
 
సాక్షి, న్యూఢిల్లీ : మున్సిపల్ సంస్థలకు నిధుల కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరింది. మున్సిపల్ సంస్థలకు నిధులు సమానంగా మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణీ, న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనపై వాదనలు విన్న అనంతరం ఢిల్లీ సర్కారుతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్, మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు, భారత ఫైనాన్స్ కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుకు మే 13లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సరిగ్గా తమ విధులను నిర్వర్తించేందుకు తక్ష ణం నిధులు విడుదల చేసేలా ఢిల్లీ సర్కారును, లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ‘క్యాంపెయిన్ ఫర్ పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ డెవలప్‌మెంట్ ప్లానింగ్’ అనే ఎన్జీవో సంస్థ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

పొగాకు ఉత్పత్తుల నిషేధంపై సర్కారుకు నోటీసు

నమిలే పొగాకు ఉత్పత్తులపై నగరంలో విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆప్ సర్కారుకు నోటీసు జారీచేసింది. మే 20న తదుపరి విచారణ జరిపేంత వరకు పొగాకు ఉత్పత్తుల అమ్మకందారులపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని సర్కారును ఆదే శించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్‌షక్దర్ బుధవారం విచారించారు. వాదనలు విన్న అనంతరం ఢిల్లీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు న్యాయమూర్తి నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరారు. ఆహారభద్రత, ప్రమాణాల చట్టం కింద పొగాకు ఉత్పత్తులను నిషేధించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదని పిటిషనర్ సుగంధీ స్పఫ్ కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు.

మరిన్ని వార్తలు