ఒంటరి మహిళలకు రూ. వెయ్యి జీవన భృతి

7 Jan, 2017 04:05 IST|Sakshi
ఒంటరి మహిళలకు రూ. వెయ్యి జీవన భృతి
► సంపాదించే అండలేని నిరుపేద అతివల కోసం సర్కారు కొత్త పథకం
► అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
► వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం
► బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
► మేనిఫెస్టోలో లేకున్నా మానవీయ కోణంలో నిర్ణయమని వెల్లడి
 

సాక్షి, హైదరాబాద్‌: సంపాదించే అండ లేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనం దించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ. వెయ్యి చొప్పున అందించాలని నిర్ణ యించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకం ప్రారంభమ వుతుందని, మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో పథకానికి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఒంటరి మహిళలు ఉంటారన్న ప్రాథమిక అంచనా ఉందని, త్వరలో పూర్తి వివరాలు సేకరించి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనప్పటికీ ఖజానాపై పడే భారాన్ని కూడా లెక్క చేయకుండా మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వివిధ వర్గాలకు లబ్ధి కలుగుతున్నప్పటికీ సంపాదన అండ లేని ఒంటరి మహిళలు తీవ్ర దుర్భర పరిస్థితులను గడుపుతున్నందున వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్న సూచ నలు అందిన దృష్ట్యా ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు.

‘‘రాజకీయ పార్టీలు చాలా వరకు మేనిఫెస్టోలోని అంశాల అమలుకే పరిమితమవుతాయి. కానీ మా ప్రభుత్వం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా వాటి పరిష్కారం కోసం పనిచేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నం. బీడీలు చుట్టి శ్రమిస్తున్నా కుటుంబానికి సరిపడా ఆదాయం పొందలేక ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి ప్రకటించినం. పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక కష్టపడుతుండటంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టినం. ఆ తరహాలోనే ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించకున్నా ఒంటరి మహిళలను ఆదుకోవాలని నిర్ణయించినం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుగా అంచనా వేసుకుని సాధ్యాసాధ్యాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలనుకున్నం. కానీ పురుషులకన్నా పేదరికం మహిళలనే ఎక్కువగా వేధిస్తుంది. నిస్సహాయులైన ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లించి వారిని ఆదుకోవాలని నిర్ణయించినం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నం. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తం’’అని సీఎం ప్రకటించారు.

వెంటనే వివరాల నమోదు ప్రారంభం...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నందున అర్హులైన వారి వివరాలను వెంటనే నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఒంటరి మహిళలు వారి పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హులైన వారికి లబ్ధి కలిగేలా చూడాలని కేసీఆర్‌ సూచించారు.
 
మరిన్ని వార్తలు