బస్సులో వీరంగం

8 Jan, 2020 09:14 IST|Sakshi
బస్సు టాప్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు

చెన్నై, టీ.నగర్‌: చెన్నై మౌంట్‌ రోడ్డులో బస్సులో వీరంగం సృష్టించిన ఇద్దరి విద్యార్థులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో కళాశాల విద్యార్థులు గొడవలకు పాల్పడడం, సిటీ బస్సులలో వీరంగం సృష్టించడం పరిపాటిగా మారింది. కొన్ని నెలల క్రితం కీల్పాక్కం ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు ప్రజలపై దాడికి దిగారు. విద్యార్థులను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఆ తరువాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇలా ఉండగా సోమవారం మౌంట్‌రోడ్డులో మందవెలి – బ్రాడ్‌వే అనే సిటీ బస్సు నెం.21లో విద్యార్థులు బస్సు టాప్‌పైకి ఎక్కి డాన్స్‌లు చేయడమే కాకుండా ప్రయాణికులతో అభ్యంతరకరంగా వ్యవహరించారు. అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డారు. దీనిపై ప్రజలు పోలీసు కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేశారు. ట్రిప్లికేన్‌ డిప్యూటీ కమిషనర్‌ ధర్మరాజ్‌ సంబంధిత విద్యార్థులపై చర్యలు తీసుకోవలసిందిగా ఉత్తర్వులిచ్చారు. మోహన్‌దాస్‌ అక్కడికి వెళ్లి విద్యార్థులను పట్టుకున్నారు. వీరు రాయపేట న్యూ కళాశాలకు చెందిన వారుగా తెలిసింది. పెరంబూరు జమాలియా ప్రాంతానికి చెందిన మీరన్‌ సుద్దీన్, ఓల్డు వాషర్‌మెన్‌పేటకు చెందిన అప్జల్‌రెహ్మాన్‌ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి సైదాపేట జైలులో నిర్బంధించారు.

మరిన్ని వార్తలు