తమిళనాడు: ప్రభుత్వ ఉద్యోగం కోసం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం కలకలం రేపింది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలోని అయలూరు గ్రామానికి చెందిన పెయింటర్ చిన్నస్వామి(32). ఇతని భార్య సుధ (30). వీరికి నందకుమార్, మధన్ అనే ఇద్దరు కుమారులు, మధుమిత అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో చిన్న స్వామి భార్య సుధ, ముగ్గురు పిల్లలతో సోమవారం ఉదయం ఈరోడ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.
అక్కడ చిన్నస్వామి అకస్మాత్తుగా తనతో తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడ భద్రత విధుల్లో ఉన్న పోలీసులు కిరోసిన్ క్యాన్ను లాక్కున్నారు. వారి వద్ద విచారణ చేయగా సుధ మాట్లాడుతూ.. పౌష్ఠికాహార ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నానని, అయితే తనకు రావాల్సిన ఉద్యోగాన్ని అధికారులు లంచం తీసుకుని మరొకరికి కేటాయించారని బోరున విలపించారు. తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ ప్రభాకరన్కు వినతి పత్రం అందజేశారు.