దక్షిణ ఢిల్లీ మేయర్‌పై తాజా ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశం

6 May, 2014 22:31 IST|Sakshi

 గుర్గావ్: బోగస్ ఓట్ల కేసుకు సంబంధించి హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్‌బీర్ కటారియాతోపాటు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితాచౌదరిపై తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మహేందర్‌సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్‌బీర్  కటారియాపై ఇప్పటికే ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన సంగతి విదితమే. తాజాగా ఆయనతోపాటు మరో 55 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1407 నంబరుగల ఇంట్లో నివాసముంటున్నట్టు పేర్కొన్న సరిత... గుర్గావ్ ఓటర్ల జాబితాలో చోటుసంపాదించుకున్నారని ఫిర్యాదుదారుడు, సామాజిక కార్యకర్త ఓంప్రకాశ్ కటారియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే చిరునామాపై మొత్తం 81 ఓట్లు ఉన్నాయని, అయితే ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో అదొక ఖాళీ స్థలమని తేలిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి భారతీయ శిక్షాస్మృతిలోని 420, 467, 468, 471, 120-బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు