న్యూఢిల్లీ: లష్కర్-ఏ-తోయిబా బాంబుల తయారీ నిపుణుడు, తీవ్రవాది అయిన అబ్దుల్ కరీం టుండాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అంగీకరించింది. ఈ నెల 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలిస్తూ అదనపు సెషన్స్ జడ్జి(ఏఎస్జె) ధర్మేష్ శర్మ తీర్పునిచ్చారు. తీవ్రవాద కార్యకలాపాల్లో తనకున్న సంబంధాల సమాచారం సేకరించేందుకు తమ కస్టడీకి టుండాను అనుమతించాలని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కోర్టును కోరింది.
గత విచారణలో తాను బాంబుల తయారీకి వినియోగించే సామగ్రిని పాతఢిల్లీలోని తిలక్బజార్లోని ఒక షాపునుంచి సేకరించినట్లు టుండా అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. బాంబుల తయారీలో ఉపయోగించే ఆయిల్ ఎక్కడనుంచి సేకరించాడనేది తెలుసుకోవాల్సి ఉందని, అందువల్ల అతడిని ఐదురోజులపాటు తమ కస్టడీకి అనుమతించాలని కోర్టుకు విన్నవించడంతో జడ్జి అంగీకరించారు.