నిబంధనలు ఉల్లంఘించారు

12 Apr, 2014 01:32 IST|Sakshi

ఘజియాబాద్: ఘజియాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీ వర్కర్లు పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు పాల్పడ్డార ని మాజీ ఆర్మీ చీఫ్, బీజేపీ అభ్యర్థి జనరల్ వీకే సింగ్ ఆరోపించారు.

జిల్లాలో నూర్పూర్ గ్రామంలోని 469, 470, 471 పోలింగ్ కేంద్రాలను గంట పాటు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు తమ అధీనంలోకి తీసుకున్నారని, ఈ సమయంలో కొందరు గూండాలు ఓటర్లను బయటికి పంపించేసి తమ అభ్యర్థికే ఓటు వేసుకున్నారన్నారు. ఘజియాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఆయన.... 2.5 లక్షల బోగస్ ఓటర్లున్నారని తాను చెప్పినా ఎన్నికల అధికారులు పెడచెవిన పెట్టారని, ఓటరు కార్డులు లేవన్న కారణంతో 60 వేల మందిని ఓటు వేయకుండా చేశారని ఆరోపించారు.
 
సైనిక సిబ్బంది విధులు నిర్వహించే చోటే ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్న నిబంధన ఉన్నా.... పలు కారణాలు చెప్పి మూడువేల మంది ని ఓటు వేయకుండా చేశారని చెప్పారు. మరోవైపు పిలఖువలోని బూత్ నంబర్ 120లో నిబంధనలు పాటించలేదని బీఎస్‌పీ అభ్యర్థి ముకుక్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. అంతేకాదు ఇద్దరు డీఎస్పీలు, ఒక ఏడీఎం, తహసీల్దార్ ఆకస్మిక బదిలీలపై కూడా ఉపాధ్యాయ్ అంతకుముందు ఫిర్యాదు చేశారు.
 
ఆయా అధికారులు తమ కులానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి వేసేలా చేసేందుకు ఆ బదిలీలు చేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అవ న్నీ నిరాధార ఆరోపణలంటూ ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ ఎస్‌వీఎస్ రంగారావు కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు