పెద్ద నోట్ల రద్దు: ఏటీఎం ధ్వంసం చేసిన కానిస్టేబుల్

19 Nov, 2016 16:39 IST|Sakshi
పాడేరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా అసహనానికి గురై ఏటీఎంను ధ్వంసం చేశాడు. విశాఖ జిల్లా పాడేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎం మాత్రమే ఉంది. పెద్ద నోట్ల రద్దుతో నోట్ల కొరత ఏర్పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకోవడానికి రాత్రివేళ ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. తన వంతు వచ్చేసరికి ఆ మిషన్ పనిచేయలేదు. అసహనంతో ఏటీఎంను గట్టిగా నాలుగైదుసార్లు కాలుతో తన్నాడు. అయినా కోపం తగ్గకపోవడంతో రెండో ఏటీఎంనూ ధ్వంసం చేశాడు. దీంతో రెండు ఏటీఎంలు ధ్వంసమై అసలుకే పనిచేయకుండా పోయాయి. ఉన్న ఒక్క కేంద్రాన్ని మూసేయడంతో శనివారం డబ్బుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల వద్ద గంటలతరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది.
 
 
>
మరిన్ని వార్తలు