పదేళ్లుగా చీకటి గదిలోనే

2 Jul, 2016 01:50 IST|Sakshi

మానసిక వ్యాధితో బాధపడుతున్న యువకుడు
సింధనూరు టౌన్ : పదేళ్లుగా చీకటి గదిలోనే గడిపిన ఓ యువకుని ఉదంతం తాలూకాలోని తిప్పనహట్టి సమీపంలోని కల్యాణ హుడేవ్ గ్రామంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దొడ్డనగౌడ, బసమ్మ దంపతుల పెద్ద కుమారుడు బసవరాజ్ పదేళ్లుగా మానసిక అస్వస్థతతో బాధపడుతూ ఇహలోకంలోని అన్ని భావాలను కోల్పోయాడు. ఎవరైనా మాట్లాడిస్తే కోపోద్రిక్తుడై ప్రతిస్పందించేవాడు. అతనిని పలు చోట్ల చూపించగా, నయం కాకపోవడంతో  చివరకు కుటుంబ సభ్యులు చీకటి గదిలో బంధీ చేశారు.

ఈ విషయంపై బసవరాజ్ తల్లి బసమ్మను సంప్రదించగా, చెట్టంత కొడుకు ఇలా కావడం తనను ఎంతో బాధిస్తోందని వాపోయింది. చుట్టుపక్కల వారు ఈసడించుకోవడం కన్నా తన కుమారుడు గదిలో బంధీ కావడమే మేలని, అన్నింటికీ ఆ భగవంతునిపైనే భారం వేశానన్నారు. ఇదిలా ఉండగా గురువారం సీనియర్ ఆరోగ్య సహాయకుడు రంగనాథ గుడి తిప్పనహట్టి గ్రామాన్ని సందర్శించి ఆ యువకుడి కుటుంబంతో చర్చించారు. కుటుంబ సభ్యులు సహకరిస్తే బసవరాజ్‌ను  తమ శాఖ తరఫున రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామని బసవరాజ్ తల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు