కుమార్తెతో కలిసి తండ్రి ఆత్మహత్య

17 Feb, 2015 01:34 IST|Sakshi

బెంగళూరు(బనశంకరి) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్థాపం చెందని భర్త, తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు... హున్నేనహళ్లికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ప్రసన్నకుమార్(38), ఉషా ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి కీర్తి(7) అనే కూతురు ఉంది. ఆరు నెలలుగా గుల్బర్గాకు చెందిన మల్లికార్జునతో ఉషా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే భర్తతో గొడవపడి నెల క్రితం మల్లికార్జునతో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని ఉషాను పిలుచుకువచ్చి దంపతుల మధ్య రాజీ చేసి, వదిలి వెళ్లారు. అయినా ఉషాలో మార్పు రాలేదు.

తనకు విడాకులు కావాలంటూ వేధించేది. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లింది.  విడాకులు ఇచ్చేందుకు ప్రసన్నకుమార్ అంగీకరించలేదు. దీంతో మూడ్రోజుల క్రితం ఉషా మళ్లీ మల్లికార్జునతో వెళ్లిపోయింది. దీంతో మనస్థాపం చెందిన ప్రసన్నకుమార్, కుమార్తె కీర్తితో కలిసి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం ప్రసన్నకుమార్ తండ్రి ఇంటికి చేరుకుని తలుపు తట్టినా తెరవకపోవడంతో బద్దులు గొట్టి లోపలకు వెళ్లి చూశాడు. తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై రాజానుకుంట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
 

మరిన్ని వార్తలు