డెడ్ స్టోరేజీ !

12 Apr, 2016 01:52 IST|Sakshi

అడుగంటిన జలాశయాలు
రాష్ట్ర వ్యాప్తంగా  తాగునీటి కష్టాలు
తక్కువ వర్షపాతంతో తగ్గిన భూగర్భ జలాలు

 

బెంగళూరు:   రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. దీంతో ఈసారి బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధానంగా పదమూడు జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలకు తాగు, సాగునీటిని వదలుతారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లు అయిన ఖరీఫ్, రబీలో 17 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంతకు ముందు గత రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. కృష్ణ నదీపరివాహక జలాశయాలైన భద్ర, ఘటప్రభ, మలప్రభ, అల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయమై కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్‌ఎన్‌డీఎంసీ) డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కావేరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కేఆర్‌ఎస్ వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజీ కంటే తక్కువకు నీటి మట్టం పడిపోవడం గమనించాం. అయితే కృష్ణ పరివాహక ప్రాంతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు.


ఈ ఏడాది మాత్రం కావేరితో పాటు కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడా డెడ్‌స్టోరేజీ కంటే దిగువన నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి.’ అని పేర్కొన్నారు. ఇక బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చే కే.ఆర్.ఎస్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 49.45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.31 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి (ఏప్రిల్-11) కేఆర్‌ఎస్‌లో 11.59 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో ఈ వేసవిలో తాగు నీటి కోసం ఎప్పుడూ లేనంతగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

 

మరిన్ని వార్తలు