కర్ణాటక: వర్షం కోసం సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి దహనసంస్కారాలు నిర్వహించిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి అణెకట్టకు చెందిన మల్లేగౌడ అనే వృద్ధుడు తొన్ని(చర్మం క్రమంగా తెల్లగా మారిపోవడం) సమస్యతో బాధపడుతూ ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పుడు అతని మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే ఇటీవల ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు తొన్నితో బాధపడుతూ చనిపోయిన వారిని ఖననం చేయకూడదని, అలా చేసినందువల్లే గ్రామం తీవ్ర వర్షాభావంతో సతమతమవుతోందని చెప్పాడు. దీన్ని నమ్మిన గ్రామస్తులు ఆ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి జ్యోతిష్యుడి సూచన మేరకు దహనం చేశారు. ఇందుకు మల్లేగౌడ కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించారు.