నిర్ణయం మీదే

7 Jan, 2016 02:13 IST|Sakshi

 జల్లికట్టు నిర్వహణపై సీఎంకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సూచన
 చెన్నై, సాక్షి ప్రతినిధి: జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే అత్యవసర చట్టం చేసుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖర్జు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సూచించారు.    రాష్ట్రంలో జల్లికట్టు పోటీలపై 2007లో నిషేధం విధించారు.  అయితే ప్రభుత్వ జా రీచేసిన చట్టాన్ని అనుసరించి ప్రతి ఏటా జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో వన్యప్రాణి సంక్షేమ సంఘం వేసిన పిటిషన్‌ను అనుసరించి 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధిం చింది.
 
 ఈ నిషేదాజ్ఞలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది పొంగల్ పండుగ సమయంలో సైతం జల్లికట్టు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగాయి. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకుండానే పండుగ దాటిపోయింది. మళ్లీ ఈ ఏడాది పండుగ సమీపించడంతో ప్రజలు, రాజకీయ పార్టీలు జల్లికట్టు జరిపి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల వే ళ కావడంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే జల్లికట్టు సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు పాటుపడుతున్నాయి. అయితే అదే స్థాయిలో వన్యప్రాణి సంక్షేమ సంఘం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది సైతం జల్టికట్టును అనుమతించరాదని పట్టుదలతో ఉండడంతో చిక్కులు కొనసాగుతున్నాయి.
 
 మీకే అధికారం ఉంది:  సుప్రీం మాజీ న్యాయమూర్తి ఇదిలా ఉండగా జల్లికట్టు నిర్వహణకు అవసరమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖర్జు ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న అధికారాలను వివరించకుండా సీఎం జయలలితను ప్రభుత్వ న్యాయసలహాదారు తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రధాని, రాష్ట్రపతికి ఉత్తరాలు రాయిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. క్రీడలు, వినోదం తదితరాలన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని ఆయన అన్నారు.
 
 రాష్ట్ర గవర్నర్ అనుమతితో కొత్త చట్టాన్ని తెచ్చుకునే అధికారం రాష్ట్రప్రభుత్వం చేతుల్లోనే ఉందని ఆయన అంటున్నారు. దున్నలు, జల్లికట్టు క్రీడాకారులు గాయపడని రీతిలో అంశాలను చేర్చి నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఖర్గే వ్యాఖ్యలను పరిశీలించిన కొందరు ఈ అంశాన్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చుకదాని ప్రశ్నించారు. మరికొందరు సచివాలయంలోని ముఖ్యమంత్రి ప్రత్యేక ఫిర్యాదుల విభాగం, ఈ-మెయిల్ చిరునామాలను ఆయనకు పంపారు. ఫేస్‌బుక్ వీక్షకుల సూచనలకు స్పందించిన ఖర్గే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
 
 ఖర్గే సూచనలపై వైగో:  మాజీ న్యాయమూర్తి ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎండీఎంకే అధినేత వైగో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
 
 జల్లికట్టు ఖాయం: బీజేపీ     ఈ ఏడాది పొంగల్ పండుగలో జల్లికట్టు క్రీడను జరుపుకోవడం ఖాయమని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 2008లో కాంగ్రెస్, డీఎంకే హయాంలోనే జల్లికట్టుపై నిషేధం అమలులోకి వచ్చిందని చెప్పారు. ఎద్దులను హింసించడం జల్లికట్టు ఉద్దేశ్యం కాదని, తమిళుల సంప్రదాయ క్రీడగానే చూస్తున్నామని ఆయన అన్నారు.గతంలో తాను ప్రకటించినట్లుగానే జల్లికట్టు జరిగి తీరుతుందని చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో మంగళవారం గంటపాటూ చర్చించానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వానియంబాడిలో బుధవారం మీడియాతో ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడుతూ, ఇటీవల కుంభకోణానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారని ఆమె తెలిపారు.
 

మరిన్ని వార్తలు