ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా

21 Oct, 2014 22:55 IST|Sakshi
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా

సన్మానసభలో శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే

భివండీ, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన తెలుగువారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.  భివండీ (తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందిన రూపేష్ మాత్రేని అఖిల పద్మశాలి సమాజ్ సంస్థ మంగళవారం ఉదయం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రూపేష్ మాత్రే మాట్లాడుతూ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడాన్నే విజయంగా భావిస్తానన్నారు.

తెలుగువారికి తోడుంటా
వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగు సమాజ ప్రజల కృషి ఉందన్నారు. వారికి అన్నివేళలా తోడుంటానన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానన్నారు. అఖిల పద్మశాలి సమాజానికి కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మనగర్ ప్రాంతంలో త్వరలోనే జన సంపర్క్ కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు. కాగా రూపేష్‌ని సన్మానించిన వారిలో  అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, సంకు శశిధర్, కొండి మల్లేశం, భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కు చెందిన కొంతమంది పదాదికారులతో పాటు వివిధ తెలుగు సంఘాల పదాధికారులున్నారు.

మరిన్ని వార్తలు