వీధి బాలల సంక్షేమంపై జారీ చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదంగా మారడంతో ఢిల్లీ పోలీసులు దానిని గురువారం ఉపసంహరించుకున్నారు. ‘తల నరకడం ఇతడు నేర్చుకోకముందే.. ఉల్లిపాయను కోయడమెలాగో నేర్పించడానికి సాయపడండి’ అంటూ వీధిబాలలను ఉద్దేశించి జారీ చేసిన ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనాథ బాలలను నేరగాళ్లుగా చిత్రీకరించడం ద్వారా బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా ఈ ప్రకటన ఉందని ఢిల్లీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తోపాటు పలు ఎన్జీఓలు విమర్శించాయి. బాలల హక్కుల కమిషన్ దీనిపై ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరడంతో ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
ఈ ప్రకటన రెండు రోజుల కింద ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. పావుపేజీ ప్రకటనలో ఓ బాలుడి ఫోటోను చూపిస్తూ ఇతడు.. ఎవరిదైనా తలకోయడం నేర్పించకమునుపే ఇతనికి ఉల్లిపాయలు కోయడం నేర్పించడానికి సహాయపడండి అని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన యువ ఫౌండేషన్లో వీధిబాలలు చేరేలా ప్రోత్సహించేందుకు కాస్త ఘాటైన సందేశాన్ని జోడించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఫౌండేషన్ వంటలు, బట్టలు కుట్టడం, హౌస్కీపింగ్ వంటి పనుల్లో బాలలకు శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు నిధులు సేకరించడానికే ప్రకటన ఇచ్చామని ఒక అధికారి తెలిపారు. ఈ ప్రకటన వెనుక ఢిల్లీ పోలీసులకు సదుద్దేశం ఉన్నప్పటికీ అందులోని పదాలు, విషయం అభ్యంతరకరంగా ఉన్నాయని ఢిల్లీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అరుణ మాథుర్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటన అనాథ చిన్నారులను బాలకార్మికులుగా మార్చేలా ఉందని బాలల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు కూడా విమర్శించాయి. వృత్తివిద్యల్లో శిక్షణ తీసుకోని వారంతా నేరగాళ్లుగా మారతారని హెచ్చరించడం ద్వారా వీధిబాలలను కించపరిచారని అభిప్రాయపడ్డాయి. బాలుని ఫోటోను స్పష్టంగా ప్రచురించడం కూడా సరికాదని విమర్శించాయి. ఉల్లిపాయలు కోయడం నేర్పించినంత మాత్రాన, వీధిబాలలకు న్యాయం చేయలేమని ఒక ఎన్జీఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ బాలల హక్కుల కమిషన్ ఢిల్లీ పోలీసు కమిషనర్కు నోటీసు జారీ చేసింది. కమిషన్ ఈ విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి కూడా తెచ్చింది. దీనిని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ ప్రకటనను సదుద్దేశంతో జారీ చేశామని, ప్రజల మనోభావాలను కించపరిచి ఉంటే తాము చింతిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. తమ సంక్షేమ పథకం ద్వారా అనేక మంది పిల్లలకు హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇప్పిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీధిబాలలంతా ఇందులో చేరాలనే ఆలోచనతోనే ఈ ప్రకటనను రూపొందించినట్లు పేర్కొన్నారు.