ల్యాండింగ్‌ సమయంలో స్కిడ్‌ అయిన సీఎం హెలికాఫ్టర్‌

11 Oct, 2019 20:45 IST|Sakshi

రాయ్‌గడ్‌ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో స్కిడ్‌ అయింది. ఈ ఘటన రాయ్‌గడ్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. రాయ్‌గడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఫడ్నవీస్‌ హెలికాఫ్టర్‌లో వచ్చారు. అయితే, హెలిప్యాడ్‌ వద్ద నేల తడిగా ఉండటంతో పైలట్‌ నియంత్రణ కోల్పోయాడు. వెంటనే తేరుకుని కొద్ది సెకన్లలోనే హెలికాఫ్టర్‌ క్షేమంగా ల్యాండ్‌ అయ్యేలా చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

హెలికాఫ్టర్‌లో సీఎం ఫడ్నవీస్‌తో పాటు ఆయన పర్సనల్‌ అసిస్టెంట్‌, ఒక ఇంజనీర్‌, పైలట్‌, కో-పైలట్‌లు ఉన్నారు. నేల తడిగా ఉండటంతోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. సీఎంతో పాటు మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. కాగా, గతంలో ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాథూర్‌లో క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి సీఎం క్షేమంగా బయటపడ్డారు.

మరిన్ని వార్తలు