వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

11 Dec, 2013 02:25 IST|Sakshi
టీ.నగర్, న్యూస్‌లైన్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. ఓట్టాన్‌సత్రం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కారును లారీ ఢీకొనడంతో  కేరళ నుంచి వస్తున్న ముగ్గురు వ్యాపారులు మృతిచెందారు. మరో సంఘటనలో బైకును లారీ ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. కేరళ ఎడుక్కి జిల్లా పెరువందానం ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఓట్టాన్ సత్రం పశువుల సంతకు సోమవారం వచ్చారు. పశువుల సంత జరగకపోవడంతో వీరు కోయంబత్తూరుకు తెల్లవారుజామున కారు లో బయలుదేరారు. కళ్లి మందయం సమీపంలో మంగళవారం ఉదయం 4.30 గంటల సమయంలో కారు వస్తుం డగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మహ్మద్ షా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన షాజహాన్, బషీర్, షికాబ్, అజిత్ బోన్‌ను మదురై ఆస్పత్రికి తరలించారు. ఇందులో బషీర్, షికాబ్ మార్గమధ్యంలో మృతి చెందారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
 దంపతుల మృతి : తిరుచ్చి జిల్లా మళప్పారై సమీపంలో గల నడువిపట్టి గ్రామానికి చెందిన బాలుస్వామి (32). ఇతని భార్య అర్చనాదేవి.  వీరు నడివిపట్టిలో గల బంధువుల ఇంటి గృహ ప్రవేశానికి తిరుప్పూరు నుంచి బైక్‌లో వచ్చి సోమవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. దిండుగల్ జిల్లా ఓట్టాన్ సత్రం సమీపంలో సాలైపొదూర్ అత్తికొంబై ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో వస్తుండగా తారాపురం నుంచి రామనాథపురం జిల్లా ఆర్‌ఎస్ మంగళం వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ సంఘటనలో దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదంపై విచారణ జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
>
మరిన్ని వార్తలు