కళ్లకు కట్టినట్లుగా..

28 Oct, 2016 12:10 IST|Sakshi
కళ్లకు కట్టినట్లుగా..
సాంకేతిక బోధన కోసం కసరత్తు
పాఠశాలల వారీగా వివరాల సేకరణ
నవంబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్న క్లాస్‌లు
ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న విద్యాశాఖ అధికారులు
 
సాక్షి, జనగామ : తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానుంది. బ్లాక్‌ బోర్డు పాఠాల నుంచి విద్యార్థులకు డిజిటల్‌ తరగతులను బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పూర్తిగా కంప్యూటర్‌ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకుసాగుతున్నారు. దృశ్య రూపంలో పాఠాలపై అవగాహన కల్పించేందుకు డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జపాన్, సింగపూర్‌లో అమలవుతున్న డిజిటల్‌ తరగతులను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టేందుకు అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఐటీ రంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డిజిటల్‌ తరగతులు నవంబర్‌ 14వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. 
 
వివరాల సేకరణ..
జిల్లాలోని 13 మండలాల్లో 108 జిల్లా పరిషత్, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో తరగతులను బోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలను కొద్ది రోజులుగా సేకరిస్తున్నా రు. అలాగే డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లకు కావాల్సిన వాతావరణం, విద్యార్థుల సంఖ్య, విద్యుత్‌ సౌకర్యాలపై ఆయా పాఠశాలల హెచ్‌ఎంల నుంచి నివేదికను కోరారు. వారం రోజుల్లో పాఠశాలలను ఎం పిక చేసి తరగతుల నిర్వహణకు కావాల్సిన నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో దాతల సహకారంతో ప్రొజెక్టర్‌తో తరగతులను కొనసాగిస్తున్నారు. తొలి విడతలో 9 మోడల్‌  స్కూళ్లు, 11 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 4 గురుకులాల్లో డిజిటల్‌  క్లాస్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వసతులు ఉన్న మరికొన్ని పాఠశాలల్లో కూడా తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కంప్యూటర్లు ఉన్న స్కూళ్లకు 1 టీబీ కెపాసిటీ కలిగిన ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌లలో డిజిటల్‌ సమాచారాన్ని నింపి ఇచ్చి విద్యార్థులకు సాంకేతిక బోధనలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
 
డిజిటల్‌ క్లాస్‌తో ప్రయోజనాలు..
పూర్తిగా వర్ణించలేని పాఠ్యాంశాలను కంప్యూటర్‌ సాయంతో బోధించవచ్చు.
ద్ద స్కీ్ర¯ŒSపై చిత్రాల ప్రదర్శనతోపాటు సబ్జెక్ట్‌లోని అంశాలను సులువుగా వివరించే అవకాశం ఉంటుంది. 
తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను విద్యార్థులకు తెలియజేయవచ్చు. 
డిజిటల్‌ విధానంలో ఒక్కసారి చదివిన పాఠం విద్యార్థులకు ఎప్పటికి గుర్తుకు ఉండడంతోపాటు త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
కష్టతరమైన ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, గణితం వంటి సబ్జెక్ట్‌లు, సోషల్‌కు సంబంధించిన ప్రపంచ, దేశ, రాష్ట్ర పటాలు, దేశాల సరిహద్దులను వివరించడం కోసం డిజిటల్‌ తరగతులు ఉపయోగపడుతాయి.   
 
పాఠశాలల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది..
డిజిటల్‌ తరగతుల నిర్వహణ కోసం అనువైన పాఠశాలల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తరగతుల ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వాలని కోరాం. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందకపోయిన నవంబర్‌ 14ను టార్గెట్‌గా పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రొజెక్టర్‌ సాయంతో కొన్ని పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ఇ¯ŒSస్టక్టర్లు అంటూ ఎవరు లేరు. డిజిటల్‌ బోధనలో ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటాం.
–యాదయ్య, జిల్లా విద్యాశాఖాధికారి
 
>
మరిన్ని వార్తలు