సామి దర్శకత్వంలో లక్ష్మీమీనన్

7 May, 2015 02:09 IST|Sakshi
సామి దర్శకత్వంలో లక్ష్మీమీనన్

దర్శకుడు సామి చిత్రంలో మరోసారి నటించడానికి నటి లక్ష్మీమీనన్ సిద్ధం అవుతున్నారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. నిజం చెప్పాలంటే ఈ కేరళ కుట్టికి కోలీవుడ్‌లో విశేష ప్రచారం తెచ్చిపెట్టింది దర్శకుడు సామినే. మైనా చిత్రానికి ముందు లక్ష్మీమీనన్ సామి దర్శకత్వంలో సింధు సమవెళి చిత్రంలో నటించారు. ఇందులో మేనమామతో అక్రమ సంబంధం కలిగిన యువతిగా నటించారు. దీంతో చిత్రం విడుదల సమయంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీంతో నటి లక్ష్మీమీనన్‌కు బోలెడు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.
 
  అయితే ఈ తరువాత అలాంటి చిత్రంలో నటించినందుకు బాధపడుతున్నట్లు ఈ అమ్మడు ఒక స్టేట్‌మెంట్ కూడా  ఇచ్చేశారు. ఆ తరువాత మైనాతో విజయాల బాటపట్టిన లక్ష్మీమనన్ మళ్లీ సామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇటీవల సామి దర్శకత్వం వహించిన కంగారు చిత్రం విడుదలైంది. దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రానికి పెణ్‌సామి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులోని కథానాయకి పాత్రకు నటి లక్ష్మీమీనన్ చక్కగా నప్పుతుందని త్వరలో ఆమెను కలిసి కథ వినిపిస్తానని సంచలన దర్శకుడు సామి అన్నారు.

మరిన్ని వార్తలు