భక్తి శ్రద్ధలతో దీపావళి వేడుకలు

25 Oct, 2014 03:29 IST|Sakshi

బళ్లారి అర్బన్ : దీపావళి పర్వదినాన్ని నగరంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఘనంగా జరుపుకున్నారు. నరక చతుర్దశి, లక్ష్మీపూజ, బలి పాడ్యమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి అంగడి ముందు వాహనాలను ముస్తాబు చేశారు. కొబ్బరి ఆకులు, మామిడి పూల తోరణాలతో అలంకరించారు. మార్వాడీలు ఎక్కువగా నివసించే జైన్‌మార్కెట్ మారుతీకాలనీ, బెంగళూరు రోడ్డు, 2వ రైల్వేగేటు వద్ద, తేరుబజారు, బ్రూస్‌పేట్ వీధుల్లో దుకాణాల్లో విశేషంగా లక్ష్మీపూజలు నిర్వహించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా బాణసంచా పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్థానిక బ్రూస్‌పేట్ సీఐ మాంతేష్, కాంగ్రెస్ నాయకుడు కాండ్ర సతీష్, హీరాలాల్ తదితరులు మార్వాడి దుకాణదారులతో కలిసి పూజలు చేశారు.
 
హొస్పేటలో..

హొస్పేట : దీపావళి పండుగను నగర వాసులు గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులు, మహిళలు పెద్దలు కలిసి బాణసంచా పేల్చి సంబరాలను చేసుకున్నారు.
 
శ్రీరామనగర్‌లో..


శ్రీరామనగర్ : పట్టణ ప్రజలు గురువారం దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వ్యాపారులు తమ దుకాణాల్లో లక్ష్మిదేవి ప్రతిమ ఉంచి వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ పూజలు చేశారు. దేవి ఫైనాన్స్ అధినేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ.జయరామిరెడ్డి మాట్లాడుతూ ఈ దీపావళి సమస్త ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను కలుగ జేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
అలాగే చిలుకూరి రామకృష్ణ, కాంతారావు తమ వ్యాపార సంస్థల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ సభ్యులు పిల్లి కొండయ్య, తమ్మినీడి సత్యనారాయణ, కనకగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరి అఖిల్, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు