జయ ఆరోగ్యంపై మాట్లాడితే నాలుకలు చీరేస్తాం

20 Jul, 2015 03:21 IST|Sakshi
జయ ఆరోగ్యంపై మాట్లాడితే నాలుకలు చీరేస్తాం

టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై అనవసరంగా మాట్లాడితే వారి నాలుకలు చీరేస్తామని అన్నాడీఎంకే ఎంపీ బహిరంగంగా హెచ్చరించడంతో సంచలనం చెలరేగింది. నామక్కల్ జిల్లా, రాసిపురం కొత్త బస్టాండు ఎంజీఆర్ విగ్రహం సమీపంలో అన్నాడీఎంకే ప్రభుత్వ నాలుగేళ్ల ప్రగతిని వివరిస్తూ బహిరంగ సభ శనివారం రాత్రి జరిగింది. ఇందులో కార్మిక శాఖా మంత్రి తంగమణి, నామక్కల్ ఎంపీ సుందరం, రాసిపురం మునిసిపల్ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ సుందరం మాట్లాడుతూ ప్రధాని మోదీ భూసేకరణ చట్టంపై మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి జయలలితను కోరారని, ఆమె మద్దతు ఇస్తేనే ఈ చట్టం నెరవేరుతుందన్నారు.

రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులు ఉన్నారనేది అర్ధం కావడం లేదని, పీఎంకే వారు కోవైలో మహానాడు నిర్వహించి అన్బుమణి తదుపరి సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. టాస్మాక్ దుకాణాలను మూసివేస్తామని అంటున్న వారు మహానాడు జరిపిన సమయంలో కోవైలో *కోటి విలువగల మద్యం విక్రయాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జయలలితను విశ్రాంతి తీసుకోమని కొంతమంది కోరుతున్నారని,  జయలలిత ఆరోగ్యంపై అనవసరంగా మాట్లాడితే వారి నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు