వీడని వెతలు

26 Aug, 2016 11:37 IST|Sakshi
  వర్షాకాలంలోనూ నీటి తిప్పలు
  505 గ్రామాల్లో నీటి ఎద్దడి
  మంజీరలో పెరగని నీటి మట్టం
  పనిచేయని మంచినీటి పథకాలు
  తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న జనం
  నీటివనరులు నిండి.. భూగర్భ జలాలు పెరిగితేనే మేలు
 
జిల్లాను నీటి ఎద్దడి పట్టిపీడిస్తోంది. కాలం మారినా తీరని సమస్యగానే మిగిలింది. వర్షాకాలంలోనూ జనం నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. దాదాపు 20 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం పట్టారుు. జిల్లాలోని దాదాపు 505 గ్రామాల్లో తీవ్ర సమస్య నెలకొంది. ట్యాంకర్లు, అద్దె బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. 
 
 
 
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 505 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. సమస్య తీవ్రంగా ఉన్న 219 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరో 286 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అందోలు మండలంలో 47, నారాయణఖేడ్‌లో 7, నర్సాపూర్‌లో 121, పటాన్‌చెరులో 25, సంగారెడ్డిలో 20, జహీరాబాద్‌లో 20, సిద్దిపేటలో 3, గజ్వేల్‌లో రెండు, దుబ్బాకలో 15, మెదక్‌లో అత్యధికంగా 222 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలతోపాటు జోగిపేట నగర పంచాయతీలో తాగునీటి సమస్య నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో నిత్యం 90 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30 ఎంఎల్‌డీ సరఫరా చేస్తున్నారు.
 
పనిచేయని మంచినీటి పథకాలు..
ఆశించిన స్థాయలో వర్షాలు పడకపోవడంతో మంజీరలోకి నీరు రాలేదు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీల కాగా ప్రసుత్తం 6 టీఎంసీలు మాత్రమే ఉంది. మంజీర బ్యారేజీలో 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 1.05 టీఎంసీలు అందుబాటులో ఉన్నారుు. మంజీరలో నీటి లభ్యత లేకపోవటంతో దాని ఆధారంగా ఉన్న మంచినీటి పథకాలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. హత్నూర, జహీరాబాద్, పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, పెద్దశంకంరపేట, ఖాదిరాబాద్ సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ పూర్తిగా అటకెక్కాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ మంచినీటి పథకం నుంచి 35 గ్రామాలకు తాగునీరు సరఫరా కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 8 గ్రామాలకు మాత్రమే సరఫరా అవుతోంది. కరస్‌గుత్తి మంచినీటి పథకం నుంచి 29 గ్రామాలకు నీటిని సరఫరా కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 12 గ్రామాలకు అందుతోంది. 
 
అందోలు నియోజకవర్గంలోనూ సమస్యే..
అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాలకు చెందిన మెజార్టీ గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది. సుమారుగా వందకుపైగా గ్రామాల్లో సమస్య ఉంది. జోగిపేట నగర పంచాయతీకి పోచారం, చక్రియాల మంచినీటి పథకాల ద్వారా నీరు సరఫరా అవుతుంది. సింగూరు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో పంపింగ్ జరగడం లేదు. రారుుకోడ్ మండలంలో ఎన్‌ఏపీ స్కీం బంద్ కావడంతో సుమారు 15 గ్రామాలకు సమస్య ఏర్పడింది. రేగోడ్ మండలంలోనూ 20 గ్రామాల వరకు నీటి ఎద్దడి ఉంది. అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇదే పరిస్థితి. 
 
మెదక్ నియోజకవర్గంలో...
మెదక్ మండలంలో సరైన వర్షాలు లేక 31 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. 19 గ్రామాల్లో 34 బోర్లను లీజుకు తీసుకున్నారు. వాడి, అవుసులపల్లి, హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, సర్ధన, వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, మక్తభూపతిపూర్, పాతూర్, బొగుడ భూపతిపూర్, కూచన్‌పల్లి తదితర గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. పాపన్నపేట మండలంలోని ఢాక్యాతండా, రాజ్యతండా, సోమ్లా, చీకోడ్ లింగాయపల్లి, నార్సింగి, పోమ్లాతండా, యూసుఫ్‌పేట, అన్నారం, కొడుపాక తదితర గ్రామాల్లో నీటి సమస్య ఉంది. రామాయంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్‌తోపాటు రామాయంపేట పట్టణంలోనూ ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి, జప్తిశివనూర్, దర్‌పల్లి, మడూర్, ఖాజాపూర్, సంకాపూర్ గ్రామాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. 
 
నర్సాపూర్‌లో...
వెల్దుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ బోర్ల నుంచి తాగు నీటిని తెచ్చుకుంటున్నారు. నర్సాపూర్‌తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కౌడిపల్లి, మహ్మద్‌నగర్, హత్నూర, సిరిపుర, దౌల్తాబాద్, గుండ్లమాచనూర్, శివ్వంపేటతోపాటు పలు తండాల్లో తాగునీటి సమస్య ఉంది. 
 
పటాన్‌చెరు పారిశ్రామికవాడలో..
పారిశ్రామికవాడల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మంజీర నుంచి నీరు విడుదల కాకపోవడమే కాకుండా గోదావరి జలాలు సరఫరా అవడం లేదు. 2001 జనాభా లెక్కల ప్రకారమే చాలా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇస్నాపూర్ చౌరస్తాలోని అనేక కాలనీల్లో సమస్య ఉంది. అమీన్‌పూర్, బండ్లగూడ, బొల్లారం ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. జిన్నారంలోని గడ్డపోతారం, జిన్నారం, బొల్లారం, గుమ్మడిదల గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
 
జహీరాబాద్ నియోజకవర్గంలో...
జహీరాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు, హమాలీ కాలనీ, 9వ వార్డులోని ఐడీఎస్‌ఎంటీ కాలనీలో మంచినీటి సమస్య ఉంది. వారం రోజుల క్రితం జహీరాబాద్ పట్టణానికి మంజీర నీటి సరఫరాను ప్రారంభించారు. పట్టణానికి 5.4 ఎంఎల్‌డీ మేర నీటి అసవరం ఉంది. 140 సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని సత్వార్, మాడ్గి, జాడీ మల్కాపూర్, అసద్‌గంజ్, అల్లీపూర్, రంజోల్, చిరాగ్‌పల్లి గ్రామాల్లో సమస్య ఉంది. ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. కోహీర్ పట్టణం, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్, న్యాల్‌కల్ మండలం ముర్తుజాపూర్ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
 
 
>
మరిన్ని వార్తలు