కెనరా బ్యాంకులో కొనసాగుతున్న విచారణ

4 Oct, 2016 08:31 IST|Sakshi

మచిలీపట్నం : స్థానిక కెనరా బ్యాంకులో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు నగలు మాయమయ్యాయని ప్రచారం ఇటీవల జరిగింది. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న జి.శ్రీరామసుబ్రహ్మణ్యం బంగారు నగలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గత నెల 28వ తే దీన బ్యాంకు డీజీఎం కే సుశీల,  బ్యాంకు చీఫ్ సెక్యూరిటీ అధికారి వి.ప్రసాద్ బ్యాంకుకు వచ్చి విచారణ చేశారు.

అధికారులు నాలుగు రోజులుగా బంగారు నగల మాయంపై విచారణ చేస్తున్నారు. బంగారు నగల తాకట్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ ప్రక్రియ  జరుగుతుండగానే ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన బంగారు నగలపై ఆరా తీసి వాటిని చూపాలని కోరారు.


 సోమవారం బ్యాంకుకు వచ్చిన ఖాతాదాలకు వారి వద్ద స్లిప్పుల ఆధారంగా తనిఖీ చేసి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై బ్యాంకు అధికారుల నుంచి ఇంకా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్‌పేట ఎస్‌ఐ హబీబ్ బాషా ‘సాక్షి’కి తెలిపారు. 

అప్రైజర్ శ్రీరామసుబ్రహ్మణ్యం కెనరాబ్యాంకు నుంచి నగలను తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్, మరో బ్యాంకులో కుదువ పెట్టారని విశ్వసనీయ సమాచారం.  కెనరా బ్యాంకు అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు