ఐటీఐ చదివి.. డాక్టర్‌ అయ్యాడు

13 Jan, 2017 16:06 IST|Sakshi
ఐటీఐ చదివి.. డాక్టర్‌ అయ్యాడు
గోదావరిఖని: ఐటీఐ చదువుకొని ఆ పై బంగారు నగల దుకాణంలో పనిచేసి అటునుంచి డాక్టర్‌ అవతారమెత్తాడో ప్రబుద్ధుడు. నేచురోపతి పేరుతో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని అమాయకుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఓ నకిలీ డాక్టర్‌ ఆట కట్టించారు పోలీసులు. కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న సంపత్‌కుమార్‌ ఐటీఐ చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం కాగజ్‌నగర్‌లోని ఓ గోల్డ్‌ షాపులో కూలీగా పని చేశాడు. అక్కడి నుంచి మెరుగైన జీవనం కోసం హైదరాబాద్‌ చేరుకొని ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు.
 
ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాధించాలనే కాంక్షతో.. నేచురోపతి నకిలీ సర్టిఫికెట్‌ సంపాదించి మార్కండేయ కాలనీలో ఆయుర్వేదిక్‌ క్లినిక్‌ తెరిచాడు. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇతని వ్యవహారం పై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్‌తో క్లినిక్‌ పై దాడులు నిర్వహించిన పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఓ ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. 
మరిన్ని వార్తలు