శిశువుకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్థిని

29 Aug, 2016 02:03 IST|Sakshi
శిశువుకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్థిని

గర్భిణి అని తెలిసి గోప్యంగా పాఠశాలకు పంపిన తల్లిదండ్రులు


మండ్య :  మలె మహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలో ఐదో తరగతి బాలిక (14) తాను చదువుతున్న పాఠశాలలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్ది సేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈవిషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.


బాలికను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భ దాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు