తృటిలో తప్పిన ప్రమాదం
చిన్న పిల్లలకు స్వల్ప గాయాలు
సాక్షి, బళ్లారి: బళ్లారి బీజేపీ లోక్సభ సభ్యుడు బీ.శ్రీరాములుకు చెందిన ఢిల్లీలోని స్వగృహంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున శ్రీరాములు స్వగృహంలో ఉన్న ఫళంగా మంటలు వ్యాపించడంతో రెండు గదుల్లో పూర్తిగా ఫర్నీచర్తో పాటు ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఢిల్లీలోని ఫిరోజ్షా రోడ్డులో ఉన్న శ్రీరాములు స్వగృహంలో మంటలు వ్యాపించడం బళ్లారిలో కలకలం సృష్టించింది. ఎంపీ శ్రీరాములు ఇంట్లో మంటలు వ్యాపించిన సమాచారం తెలియడంతో బళ్లారిలోని శ్రీరాములు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.
ఈ ప్రమాదంలో చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులందరూ బయటపడ్డారు. ఈసందర్భంగా ఢిల్లీలో ఎంపీ బీ.శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ తాము ఇంట్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించాయని, అయితే తృటిలో అందరూ అగ్ని ప్రమాద స్థలం నుంచి బయటకు వచ్చామన్నారు. చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా బళ్లారి ఎంపీ శ్రీరాములు ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.