రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

9 Feb, 2015 07:19 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

సాక్షి, బళ్లారి(దావణగెరె): పెళ్లి బృందంతో వెళ్తున్న బోలెరో టెంపో వాహనం బోల్తా పడి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ  ఘటన ఆదివారం మధ్యాహ్నం తాలూకాలోని హుణసెకట్టె సమీపంలో జాతీయ రహదారి-4పై చోటు చేసుకుంది. వివరాలు.. బళ్లారికి చెందిన రామాంజనేయతో హరిహర తాలూకా నిట్టూరుకు చెందిన రామకృష్ణ కుమార్తె మేరీ వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి వీరికి బళ్లారిలో రిసెప్షన్, సోమవారం వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హరిహర తాలూకా నిట్టూరు క్యాంప్ నుంచి రామకృష్ణ కుటుంబం, బంధువులు దాదాపు 20 మంది వధువుతోతో కలిసి బోలెరో టెంపోలో  దావణగెరె-చిత్రదుర్గ మీదుగా బయల్దేరారు.
 
 హుణసెకట్టె సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.  ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో వధువు తండ్రి రామకృష్ణ(48), వధువు పెద్దమ్మ లక్ష్మమ్మ(55), బంధువులు రాజన్న(50), ఆదిలక్ష్మమ్మ(48), టెంపో డ్రైవర్ అషఫ్(్ర40)మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దావణగెరె, చిత్రదుర్గంలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండకు చెందిన అనంతలక్ష్మి, మంగళమ్మ, నిట్టూరుకు చెందిన సిద్దేష్, గంగమ్మ, రత్నకుమారి, వినుత, చంద్రప్ప, రుతు, వధువు మేరీ ఉన్నారు. వీరిలో వినుత మినహా తక్కిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఇదిలా ఉండగా ప్రమాద తీవ్రతకు బోలెరో టెంపో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటన స్థలాన్ని రూరల్ డీఎస్పీ నేమేగౌడ, సీఐ పంపాపతి, ఎస్‌ఐ సిద్దేశ్‌లు తమ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దావణగెరె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు