నిమజ్జనానికి వెళ్లి నలుగురి మృతి

7 Sep, 2016 22:47 IST|Sakshi
నిమజ్జనానికి వెళ్లి నలుగురి మృతి
– నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి
– తిప్పనపల్లె శోకసంద్రం
– మతులు కూలీల బిడ్డలు
 
సూర్యాస్తమయ సమయం..పక్షులన్నీ గూళ్లకు చేరుతన్న వేళ..పొలాలకు వెళ్లిన కూలీలు వడివడిగా ఊరు చేరుతున్న వేళ.. తప్పెట శబ్దాలు, కళాకారుల చిందులు, ఈలలు కేకలు...ప్రథమ పూజ్యుడు నిమజ్జనానికి బయలుదేరిన వేళ.. ఆ విధికి కన్నకుట్టిందేమో.. చెరువు రూపంలో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకుంది. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల చోటుచేసుకున్న ఈ ఘటన చాగలమర్రి మండలం తిప్పనపల్లె గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కంటతడిపెట్టించింది.
 
చాగలమర్రి:  గణేశ్‌ నిమజ్జనం.. ఊరువాడా సందడే సందడి. ఉరకలేసే ఉత్సాహంతో పిల్లాపెద్దలు.. స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. కొందరు పనులు సైతం మానుకున్నారు. చాగలమర్రి మండలం తిప్పనపల్లెలోనూ నిమజ్జన కోలాహం బుధవారం ఉదయం నుంచే మొదలైంది. వేడుక సందడిలో అల్లరిచేసే పిల్లల గురించి పెద్దలు పట్టించుకోవడం మరిచిపోయారు. వారెక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. దీంతో వేడుకలో అపశ్రుతి దొర్లింది. నిమజ్జనం చేసే చెరువు నలుగురు చిన్నారులను మింగేసింది.      
గ్రామంలో దళితవాడకు చెందిన బండి ఓబులేసు(12), శ్రీహరి(13), గడ్డం రాము(12), విష్ణువర్ధన్‌(13).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. నిమజ్జనం సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో వీరి ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచే తోటి మిత్రులతో వేడుకలో అలా ఇలా చేయాలని చర్చించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ముందుగా ఊరి సమీపంలోని నిమజ్జన చెరువు వద్దకు చేరాలనుకున్నారు. అనుకున్నదే తడువు ఉరుకులు పరుగులు మీద కిలోమీటర్‌ దూరంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. విగ్రహాలను నిమజ్జం చేసేందుకు ఇంకా సమయం ఉందని..అంతలోపు ఈత కొడదామని చెరువులోకి దిగారు. బుధవారం ఉదయమే తెలుగుగంగ అధికారులు చెరువుకు నీరు చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి నలుగురు చిన్నారులు అందులో చెరువులో చిక్కుకుపోయారు. భయంతో కేకలు వేయడంతో సమీపంలో పొలాల్లో ఉన్న గ్రామస్తులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ లోపు సమీపంలోనే నిమజ్జన వేడుకలో ఉన్న గ్రామస్తులు గుంపులు గుంపులుగా చెరువు వద్దకు చేరుకున్నారు. మునిగిపోతున్న చిన్నారులను వెలికి తీసి ఒడ్డుకు చేర్చారు. చాగలమర్రిలో నిమజ్జన వేడుకల్లో ఉన్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సైతం విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని తన జీపులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్‌ వారి తల్లిదండ్రులు మోటార్‌ సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండా మార్గమధ్యంలో మతి చెందాడు. మిగిలిన ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. విష్ణువర్ధన్‌ మతదేహాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు పురుగుల మందు తాగేందుకు యత్నిస్తుండగా బంధువుల అడ్డుపడి వారించారు. 
 
అందరూ కూలీల పిల్లలే..
 తిప్పనపల్లె చెరువులో మృతి చెందిన చిన్నారులంతా కూలీల పిల్లలే. బండి ఓబులేసు తల్లితండ్రులు నాగేశ్వరరావు, వెంకటమ్మలు కూలీ పని చేస్తూ కుమారున్ని చదివిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా వారు పొలంలో పనులకు వెళ్లారు. వినాయక నిమజ్జం ఉండడంతో మందుగా ఇంటికి చేరుకొన్నారు. కుమారుడి మరణ వార్తవిని గుండెలు పగిలేలా రోదించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు అడపిల్లలు ఉన్నారు. మృతి చెందిన ఓబులేసు చివరి వాడు.
 
 గడ్డం రాము తల్లిదండ్రులు బలరాం, సుబ్బమ్మలు సైతం కూలీ పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడిని బాగా చదివించి ప్రయోజకున్ని చేయాలనేది వీరి లక్ష్యం. నిత్యం కూలీ పనికి వెళ్తూ..కుమారున్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. వారి ఆశలు చెరువు మింగేసింది. వారి రోదన వర్ణనాతీతం.
 
 తిరుపాలు, ధనలక్ష్మి కుమారుడు శ్రీహరి చురుకైన బాలుడు.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తమ కుమారుడు మంచి ప్రయోజకుడువుతాడని తల్లిదండ్రులు కలలు కనేవారు. ముందుగా వినాయక నిమజ్జన ప్రదేశానికి వెళతామని చెప్పి వతిరిగిరాని లోకాలకు వెళ్లాడని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
ప్రతాప్‌కు విష్ణువర్దన్‌ ఒక్కగానొక్క కుమారుడు.. బాగా చదివేవాడు. తన కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో పురుగు మందు తాగేందుకు ప్రతాప్‌ ప్రయత్నించగా..అక్కడే ఉన్న బంధువులు వారించి వారికి నచ్చచెప్పారు. 
 
మరిన్ని వార్తలు