కుమారుడి కళ్లెదుటే తల్లిపై సామూహిక అత్యాచారం

9 Mar, 2016 11:10 IST|Sakshi
కుమారుడి కళ్లెదుటే తల్లిపై సామూహిక అత్యాచారం

బెంగళూరులో కీచక పర్వం
 
బెంగళూరు: బెంగళూరులో పద్నాలుగేళ్ల కుమారుడి ఎదురుగానే అతడి తల్లి(35)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ తతంగాన్ని నిందితులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రధాన నిందితుడికి సదరు మహిళతో విభేదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరమైన మహిళ తన కుమారుడితో కలసి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరిధిలోని నాయకనహళ్లిలో ఉంటోంది. ఈ నెల 6న అర్ధరాత్రి స్థానిక జిల్లా పంచాయతీ సభ్యుడైన సంతోష్‌రెడ్డి, అతడి అనుచరులు బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కుమారుడిని బంధించి అతడి కళ్లెదుటే రాక్షసంగా వ్యవహరించారు. దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే సెల్‌ఫోన్‌లోని వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరించారు.

మొదట్లో భయపడిన బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. చివరకు స్నేహితులు అండగా నిలవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా సంతోష్‌రెడ్డి వాదన మరోలా ఉంది. సదరు మహిళ తమ బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల వారి కుటుంబంలో కలతలు చెలరేగాయని చెప్పాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి మాత్రమే ఆమె ఇంటికి వెళ్లామని తెలిపాడు.
 

>
మరిన్ని వార్తలు