వాకింగ్ వెళ్తే ఇల్లు లూటీ

16 Sep, 2014 03:28 IST|Sakshi

మైసూరు : ఇక్కడి విజయనగర మొదటి స్టేజ్ రెండో క్రాస్‌లో నివాసముంటున్న ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు... కువెంపు ట్రస్ట్ సమీపంలోని ఇంటి నెంబర్ 74లో రవీంద్రనాథ్, ఆయన భార్య ఉషా నివాసముంటున్నారు. రవీంద్ర నాథ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో రవీంద్ర భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని పార్కుకు వాకింగ్ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి మొదటి అంతస్తులోని బాల్కని ద్వారా లోనికి ప్రవేశించి మొదటి, రెండో అంతస్తుల్లోని మూడు బీరువాల్లో రూ. 10 లక్షల విలువైన బంగారు నగలతో పాటు విలువైన డైమండ్ నెక్లెస్‌తో పాటు పలు విలువైన నగలతో ఉడాయించారు.

గంట తరువాత ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ రవి, క్రైం బ్రాంచ్ ఎస్‌ఐ రఘ ప్రసాద్, సీసీబీ సీఐ సూరజ్ తదితరులు పరిశీలించారు. పోలీసు జాగిలంతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలివిగా ఒక కర్ర సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు