తిరువొత్తియూరు, న్యూస్లైన్:
చెన్నై త్యాగరాజనగర్లో వ్యాపారి వద్ద నగలు చోరీ చేసిన చెన్నై విల్లివాక్కంకు చెందిన యువకున్ని పోలీసు బృందం అరెస్టు చేసింది. రూ.1.25 కోట్ల విలువ కలిగిన 530 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మాంబలం దురైసామి సబ్వే సమీపంలో మహేష్ కుమార్ నగల దుకాణం డుపుతున్నారు. ఈయన తన కారులో 5 కిలోల నగలను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మహేష్ కుమార్ దృష్టి మరల్చి 5 కిలోల నగలను చోరీ చేశారు. ఈ సంఘటనపై త్యాగరాయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విచారణలో విల్లివాక్కం లోని రాజమంగళం ప్రాంతానికి చెందిన ఏసుదాస్, అతని సహచరులకు ఈ చోరీలో సంబం ధం ఉన్నట్టు తెలిసింది. వీరి కోసం గాలించగా, ఏసుదాస్ మణలిలో బంధువుల వివాహానికి వస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు మణలిలో నిఘా వేశారు. కానీ ఏసుదాస్ అక్కడికి రాలేదు. ఈనెల 29వ తేదీ రాత్రి నుంగంబాక్కం వళ్లువర్ కోట్టం సుందర దిన పార్కు వద్ద ఉన్న ఏసుదాస్ను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఏసుదాస్ ఇచ్చిన సమాచారం మేరకు అతని వద్ద ఉన్న 530 సవర్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగలతో పాటు ఏసుదాస్ను కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.