వేలూరు, న్యూస్లైన్: ద్విచక్ర వాహనాన్ని ప్రభుత్వ బస్సు ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఫటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వేలూరు సేన్బాక్కంకు చెందిన ఆనందన్ కుమారుడు లింగేశ్వరన్(23) ఎద్దుల బండి కార్మికుడు, అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు కార్తీతో ఉదయం ద్విచక్ర వాహనంలో పట్టణానికి బయలుదేరారు. కొనవట్ట సమీపంలోని మసీదు వద్ద వెళుతున్న సమయంలో వేలూరు వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొంది.
లింగేశ్వరన్ అక్కడికక్కడే మృతి చెందాడు, వెనుక వైపు కూర్చొన్న కార్తీ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డుపై ప్రమాదం జరగడంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ను మళ్లించారు.