బొమ్మనహళ్లి : నకిలీ దాఖలాలను సృష్టించి రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారిపై దాడులు జరిపి సదరు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ శంకర్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని కెంగేరీ పరిధిలో ఉన్న మాళిగొండనహళ్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి తార్ ప్లాంటేషన్ ఇండస్ట్రీ పేరుతో సంస్థకు 55 ఎకరాల భూమిని మంజూరు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రెవెన్యూ అధికారులకు అక్కడికి చేరుకుని రెండు జేసీబీ యంత్రాలు, నాలుగు టిప్పర్లు, సంస్థకు చెందిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కరోజే రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.