ప్రభాదేవి త్రిశతాబ్ది ఏర్పాట్లు పూర్తి

26 Apr, 2015 23:16 IST|Sakshi

- ఘనంగా నిర్వహించనున్న ట్రస్టు సభ్యులు
- ఈ నెల 29తో 300 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్సవాలు
సాక్షి, ముంబై:
ప్రభాదేవి మందిరం ఆధ్వర్యంలో త్రి శతాబ్ది (300 ఏళ్లు) ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమై బుధవారం రాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

త్రి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని ప్రభాదేవి జన్ సేవా సమితి వర్గాలు తెలిపాయి. దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభాదేవి పరిసర ప్రాంతంలో మరాఠీ, తెలుగు ప్రజలు అధికంగా ఉంటారు. ప్రతి ఏటా జనవరిలో వారం రోజులపాటు జాతర జరుగుతుంది. కుల, మత భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శాకంబరిగా ప్రభాదేవి..

12వ శతాబ్దంలో ప్రభాదేవి మాతను శాకంభరి పేరుతో కొలిచేవారు. యాదవ్ సామ్రాట్ బింబ్ రాజాకు కులదైవమైన శాకంభరి ఆరు శతాబ్దాల తరువాత శ్యాంనాయక్ అనే వ్యక్తి కలలోకి వచ్చి తనకు మందిరం కట్టించాలని చెప్పింది. నాయక్ మందిరం కట్టించినప్పటి నుంచి అందరూ ప్రభాదేవిగా పిలుస్తున్నారు.

మొఘల్ సామ్రాట్ గుజరాత్‌పై దండయాత్ర చేసినప్పుడు ప్రభావతి విగ్రహాన్ని కర్నాటకకు తరలించారు. అయితే అక్కడ సముద్రంలో కొట్టుకుపోయిన ఈ విగ్రహం మాహింలోని తీరం వద్ద తేలింది. దాన్ని చూసిన శ్యాం 1716లో వైశాఖ శుద్ధ ఏకాదశీ రోజున ఈ విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టించారు.

మరిన్ని వార్తలు